19, సెప్టెంబర్ 2017, మంగళవారం

కవిత్వ ప్రపంచం

ఇప్పటి తరానికీ కావాలి ఒక తృణ కంకణం
రాయప్రోలు మైలు రాయి 
అబ్బూరి చలివేందర
సౌభద్రుని ప్రణయ యాత్ర
చదవాలని తొందర
అన్నాడు శ్రీశ్రీ తన సిప్రాలి లో . శ్రీ శ్రీ లాగే నేను కూడా రాయప్రోలు తృణకంకణం చదవాలని తొందరపడ్డాను . నిజానికి రాయప్రోలు ను కవిత్వాన్ని నాకు పరిచయం చేసింది మా తెలుగు సర్ శ్రీ పి . నరసింహా రావు గారు . మా స్కూల్ డే వేడుకకి నా ఏడవతరగతి లో " ఏ దేశ మేగినా , ఎవ్వరెదురైనా " అనే దేశభక్తి గీతం నేర్పించారు . అప్పుడే గురజాడ" దేశమును ప్రేమించుమన్నా" , మహమ్మద్ ఇక్బాల్" సారె జహాఁ సి అచ్చా " రచయత ఎవరో తెలియదు కానీ హిందీ పాట " హమ్ హొంగే కామ్ యాబ్ " ఇంగ్లిష్ పాట " ఉయ్ షల్ ఓవర్ కమ్ " ఇలా చాలా దేశభక్తి గీతాలు మాకు నేర్పించారు . రాయప్రోలు " ఏ దేశ మేగినా " నా హృదయం లో కొలువుండి పోయింది .
గురజాడ వేసిన అభ్యదయ రహదారిని ముప్ఫయి ఏళ్ల పాటు విస్మరించిన తెలుగు కవిత్వం మళ్ళీ శ్రీశ్రీ రాక తోనే దారి లో పడిందని చాలామంది అభిప్రాయం . రాయప్రోలు , కృష్ణశాస్త్రి , నాయని , వేదుల , వెంకట పార్వతీశం కవులు ఇలా చాలా మంది భావకవిత్వం అనే పల్లకి మోసిన బోయీలు . శ్రీశ్రీ షాక్ ఇచ్చేంతటివరకు ఆ యాత్ర అలాగే కొనసాగింది . భావకవిత్వం లో కూడా రాయప్రోలు ది విభిన్నమైన డిక్షన్ . కృష్ణశాస్త్రి లాగా అతడు మరీ నిరాశా వాది కాదు . సంప్రదాయము , ఆధునికత కలగలసిన నవ్య సాంప్రదాయం అతనిది . అందుకేనేమో తెలియదు కానీ
డాక్టర్ అక్కిరాజు రామాపతి రావు గారు ఆధునిక తెలుగు కవితా రీతులకు గురజాడ అప్పారావు ఉషోదయమైతే , రాయప్రోలు సుబ్బారావు అరుణోదయమని చెప్పాలి అన్నారు . అంటే ఆయన ఇద్దరికీ సమాన ప్రాతినిథ్యం ఇచ్చారు .
గురజాడ సంప్రదాయం పూర్తిగా వదిలివేసి తన రచనలతో పూర్తిగా ఆధునికత వైపు దృష్టి సారిస్తే రాయప్రోలు సంప్రదాయాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండా సంప్రదాయం లోనే ఒక నవీనత సాధించడానికి ప్రయత్నం చేశాడు . ఇది వాళ్ళ కవిత్వ రూపాలలో కూడా కనిపిస్తుంది . గురజాడ ముత్యాలసరాలు అనే కొత్త ఛందస్సు సృష్టించి ప్రజలకు తేలికగా అర్ధమయ్యే గేయాన్ని తన భావాలకు వాహికగా చేసుకుంటే , రాయప్రోలు అంత తేలికగా అర్ధమవని ఖండ కావ్యాలను ఆలంబనగా చేసుకున్నాడు . గురజాడ కథలు , నాటకాలు కూడా రాస్తే రాయప్రోలు వాటి జోలికి వెళ్ళలేదు . గమనించాల్సిన విషయం ఏమిటంటే గురజాడ రచనా జీవిత దాదాపు ముగింపుకి వచ్చినప్పుడు రాయప్రోలు సాహిత్య జీవితం మొదలు అయింది . గురజాడ కష్టపడి వేసిన రహదారిని కాదని రాయప్రోలు సొంత దారి వేసుకోవడం ఎందుకు అనే ప్రశ్నకు బహుశా సమాధానం ఎక్కడా దొరకదేమో
చిత్రం గా గురజాడ పూర్ణమ్మ ఆత్మహత్య చేసుకుంటే , రాయప్రోలు తృణకంకణం లో కథానాయకుడు ప్రేయసిని చివరకు సోదరిగా భావించడము అనే అతి పెద్ద అసాధ్యమైన , అనితరసాధ్యమైన నిర్ణయం తీసుకుని జీవితాన్ని నిలుపుకున్నాడు . ఈ సంక్లిష్టత ను అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమే .
పాశ్చాత్త్యా దేశాలలో వచ్చిన రొమాంటిసిజం అనే వాదాన్ని భావ కవిత్వం గా మలచి , అమలిన శృంగారం అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఖండ కావ్యం తృణకంకణం . అమలిన శృంగారం సిద్ధాంతము ఎందుకు అంటే ధర్మ వ్యవస్థను కాపాడటానికి రాయప్రోలు పడిన శ్రమ అమలిన శృంగార పరి కల్పనం అని శ్రీమతి పి . యశోదా రెడ్డి అభిప్రాయపడ్డారు . తృణకంకణం గురించి చదవాలని తొందర పడ్డాను అన్నాను కదా
తృణకంకణం అంటే గడ్డి తో చేసిన తోరము అని అర్ధం . తేలికగా అర్ధమయ్యే భాష లో చెప్పాలి అంటే గ్రాస్ బ్రాస్లెట్ . కథ లో ఇప్పటి కళ్ళకి కొత్తదనము ఏదీ కనిపించదు . ఒక అందమైన అమ్మాయి . ఎంత అందమైనది అంటే
పదియు నారు వసంతముల్ వదలనట్టి
వయసు సొగసుందనం ఆమె మెయిని మెరయు అందగత్తె
ఒక అందమైన అబ్బాయి . ఎంత అందమైన అబ్బాయి అంటే
తేట వలపులు మొలకెత్తినది మొదలు చిర సమ్మేళన విశేష కాంక్షారక్తి తో ఉన్న తరుణ తనూ మోహనుడు
ఇద్దరూ ప్రేమలో తలా మునకులుగా మునిగిపోయారు . విధి కూడా తమను విడదీయలేదు అనుకున్నారు . రస రాజ్య శిఖరాల అధిరోహణమే తమ జీవన సాఫల్యం అనుకున్నారు . తమ ప్రేమకు చిహ్నం గా
భావ బంధంబు గా మణిబంధమందు
తొలుత గట్టే నొక పట్టు తోరము
కానీ విడదీయలేదు అని వాళ్ళు అనుకున్న విధి వారిని విడదీస్తుంది . ఆమె కు వేరొకరి తో వివాహం జరుగుతుంది . ఆ తరుణ తనూ మోహనుడు భగ్న ప్రేమికుడి ,గా ఆమె నే శ్వాసిస్తూ , ఆమెనే ధ్యానిస్తూ , జీవితం అంటే విరక్తి పెంచుకుంటాడు . సకల దుర్వ్యసనాలకు తనను తాను అర్పించుకుంటాడు . కొంతకాలమైన తరువాత
ఆమె తన పుట్టింటికి వస్తుంది . తన ప్రేమికుడి దురవస్థకు చలించి పోతుంది .
అతడిని మళ్ళీ సరిఅయిన మార్గం లో నడపాలి అనుకుంటుంది . వాళ్ళ సంకేత స్థలానికి చేరుకుంటుంది .
తన ప్రేమికుడి కి పరి పరి విధాలా కౌన్సిలింగ్ చేస్తుంది .
నా ప్రియ సఖి !, అనురూప గు
ణ ప్రతిమ ! ప్రసన్నశీల !నవనీత శిరీ
ష ప్రణయ మృదుల హృదయ !క
టా ప్రాణములుండ ఎటు విడంబడి సైతున్
అన్న ప్రేమికుడికి
వలపులె రహస్యములు, తద్విఫలదశలు ని
గూఢములు .తదర్థములును గోప్యములు వి
దగ్ధుల కనుభవైక వేద్యంబు లివియే
ఏల ప్రేమ గర్భ విమర్శ యిపుడు సఖుడా
అని జవాబు చెపుతుంది
ఇలా చాలా సేపు ఆమె అతడికి నచ్చ చెపుతుంది . నన్ను మర్చిపొమ్మని చెప్పటం లేదు . నామీద ఉన్న ప్రేమ భావనని సోదర ప్రేమ గా మల్చుకొమ్మని చెపుతుంది . సోదరిగా ఎప్పుడూ తను అతడితోనే వుంటాను అని చెపుతుంది . చివరకతడు
ఈ తృణకంకణంబు భరియింపుము నీ మణిబంధమందు , సం
ప్రీతిని అప్పుడప్పుడు వలపింపుల నెయ్యము జ్ఞప్తిగొన్న ప్రా
భాతికవేళ నీ ప్రణయ భాష్ప జలాంజలి నింత చల్లి యే
రీతిని వాడకుండా నలరింపు మిదె తుది వాంఛ సోదరీ
అంటాడు .
వలపు నశించియును ప్రేమ నిలువగలద
యేని కలనైన కలుషము గాని స్నేహ
మృదు మధు రసానుభూతిని పొదలి , మనము
నీడలట్టుల నైక్య మందెదముగాత
అని రాయప్రోలు ఆమె చేత చెప్పించి తృణకంకణం అనే ఖండ కావ్యం ముగిస్తాడు .
ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఒక ఐహిక ఆముష్మికాతీతమైన బంధాన్ని సృష్టించి దానికి అమలిన శృగారమనే పేరుపెట్టి ఒక కొత్త సిద్ధాంతాన్ని తెలుగు సాహిత్య లోకం లోకి ప్రవేశ పెట్టాడు . దాని నే పాశ్చాత్య ప్రపంచం లో ప్రాచుర్యం లో వున్నా ప్లేటోనిక్ లవ్ తో ముడి పెట్టి రెండూ ఒకటే అన్నారు మన విమర్శకులు .
ఎందుకో తెలియదు కానీ నాకు ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి గుర్తుకు వస్తున్నాడు .
మనము ఏదయినా ఒక దాని గురించి మాట్లాడుతున్నాము అంటే మన ఆలోచనలని , మన అనుభూతులను దానిలో వాటిని ఆరోపిస్తున్నాము అన్న మాట. ఈ ఆరోపణలు ఏవీ లేని , ఏ ఇతరేతర అంశాలు ఒక దాని మీద ఓవర్ లాప్ కానీ అంశాన్ని అంశం గా మాత్రమే చూడాలి . అప్పుడు మాత్రమే దాని నిజ స్వరూపం మనకు అర్ధం అవుతుంది .మనం దేనికైనా ఒక పేరు ఇస్తున్నాము అంటే దానిని ఆ పేరు తో గుర్తిస్తున్నాము అన్న మాట . ఒక గుర్తింపు వస్తువు లేదా అనుభూతి అసలైన స్వరూపాన్ని అనుభవం లోకి తీసుకుని రాదు మనం ఒక పువ్వు ను గులాబీ అని , చేమంతి అని పిలుస్తున్నాము అంటే గులాబీ , చేమంతి లక్షణాలని వాటి లో అన్వేషిస్తాము . అలా పేరు ఇవ్వకుండా పువ్వు ను మనం చూడాలి అంటాడు . సరిగా ఇదే భాష కాక పోయినా ఇదే భావం .
స్త్రీ పురుషుల మధ్య ఉండే బంధానికి ఏ పేరును ఇచ్చినా అంతకుముందే ఆ బంధాలకు మనం ఇచ్చిన లక్షణాలను మనం ఇచ్చిన పేరు లో వెతుక్కుంటాము .
అది శృగారమా అమలిన శృగారమా . లేక ప్రేమా , లేక స్నేహమా , లేక మరొకటా అనేది .
నిజానికి ఈ తండ్లాటా ఎప్పుడూ ఉండేదే .
ఇంతకుముందే వివాహ బంధం లో వుండే ధర్మాన్ని కాపాడటం అనే సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం ఒక నవ్య సంప్రదాయాన్ని రాయప్రోలు సృష్టించాడు . ప్రేమ ను స్నేహం గా మార్చేయమన్నాడు
ఉత్తర రామ చరిత్ర లో భవభూతి కరుణ రస మొక్కటే రసమని చెపుతూ ఆ రసమొక్కటే అవస్థా బేధంతో అనేక రస రూపాలను ధరిస్తుంది అని చెప్పినట్టు గా
రాయప్రోలు శృంగారమొక్కటే అవస్థా బేధం తో పలు రసాలుగా మారుతుందనారు
ఈ ప్రయత్నం లో స్నేహాన్ని , వాత్సల్యాన్ని శృంగార శాఖలు గా పరిగణించారు
తృణకంకణము లో కథానాయకను చదువుతుంటే గురజాడ కాసులు కూడా గుర్తుకు వస్తుంది . కాసులు , తృణకంకణ నాయక ఒకే నాణేనికి రెండు వైపులు
తెలుగు సాహిత్యానికి భావకవిత్వం మంచి చేసిందో , చెడు చేసిందో నాకు తెలియదు కానీ స్త్రీ ని ఒక ఉన్నత స్థానం లో చూసే దృష్టిని పురుషుడికి ఇచ్చింది .
ఆమె నవనీత హృదయ
నా ఆశా పథాన్త రాల నవ పారిజాతమ్ము
అంటూ స్త్రీ ని కుసుమ కోమలం గా సంభావించే సంస్కారం నేర్పింది
దాదాపు డెబ్బై ఏళ్ళ తరువాత ఇప్పుడు నిన్ను కోరి , అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు , కొత్త తరం యువకులతో , కలసి వాళ్ళ ఆంతరంగిక వేదనలను గమనిస్తున్నప్పుడు
మళ్ళీ తృణ కంకణం లాంటి కావ్యం వస్తే బావుంటుంది అనిపిస్తోంది .
ఈ కాలానికి తృణకంకణం ఎందుకు ? తృణ కంకణం ధరించిన చేతికి ఎప్పుడూ బాధ కలుగనీయదు . చేతి కి అనుగుణం గా ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఇన్ని నీళ్లు చిలకరిస్తే చాలు . పచ్చపచ్చ గా మారి అందం గా ఆహ్లాదంగా పరిమళిస్తుంది . మనిషి కి ప్రేమ కూడా అలాగే ఉండాలి . అది హృదయాన్ని గాయపర్చకూడదు . హృదయాన్ని తేజోవంతం చేయాలి . హృదయాన్ని పరిమళ భరితం చేయాలి . ప్రేమను ఇతరేతర అంశాలనుండి విముక్తం చేయాలి .
ఇప్పటి తరానికి నిజమైన ప్రేమ తప్పిస్తే మిగతా అంశాలు అన్నీ తెలుసు . వాటి అన్నిటి నుండి ప్రేమను విముక్తం చేసి ప్రేమను అనుభవైకవేద్యం చేయాలంటే
ఇలాంటి కావ్యాలు మళ్ళీ రావాలి . కానీ రాశేవారు ఏరి ?

కవిత్వ ప్రపంచం

నా యవ్వన వన వనమాలి శ్రీశ్రీ
ప్రపంచమొక పద్మ వ్యూహం 
కవిత్వమొక తీరని దాహం
అన్నాడు శ్రీ శ్రీ . ప్రపంచమొక పద్మవ్యూహం అవునో కాదో నాకు తెలియదు కానీ కవిత్వం మాత్రం తీరని దాహమే . ఎంత చదివినా , ఎంత రాసినా , ఎంత సేపు ఆ ఆనుభవిక ప్రపంచం లో విహరించినా తనివి తీరదు .నా యవ్వన వనం లోకి కొత్త గాలిలా వచ్చినవాడు శ్రీశ్రీ .
నేను ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కాలేజీ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో అడ్మిషన్ తీసుకున్నాను . అప్పుడు రెండు విద్యార్థి ఆర్గనైజేషన్స్ బాగా యాక్టీవ్ గా ఉండేవి . ఒకటి ఎస్ ఎఫ్ ఐ . రెండవది పి .డి .ఎస్ యు . కొత్త గా చేరిన విద్యార్థులను పార్టీ లో చేర్చుకోవడానికి అవి ప్రయత్నం చేసేవి . క్లాస్ కి క్లాస్ కి మధ్య విరామ సమయం లో వచ్చి తమ పార్టీల గురించి చెప్పి సభ్యత్వం ఇచ్చేవి . అలా ఒక క్లాస్ విరామ సమయం లో ఎం . పుల్లయ్య అనే మా సీనియర్ క్లాస్ కి వచ్చి ఆకలి రాజ్యం సినిమా లోని సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ అనే పాట పాడాడు . ఈ పాట ఎవరు రాశారు అని అడిగితే శ్రీ శ్రీ అని చెప్పాడు . నిజానికి ఆ పాట శ్రీశ్రీ కాదు ఆత్రేయ రాసింది . అందరి లాగే శ్రీశ్రీ అని పుల్లయ్య కూడా భ్రమపడి నట్టున్నాడు . అలా ఆత్రేయ పాట ద్వారా శ్రీశ్రీ నాకు పరిచయం అయ్యాడు . శ్రీశ్రీ కవిత్వం తో నా ప్రయాణం ఇంకా కొనసాగుతూ వున్నది
శ్రీ శ్రీ అంటే చాలామందికి మహాప్రస్థానమే . దాన్ని మాత్రమే చదివి శ్రీ శ్రీ తమకు రక్త మజ్జాస్థిగతమ్ అయ్యాడు అనుకుంటారు చాలామంది . శ్రీ శ్రీ సాహిత్యం తో సుదీర్ఘ ప్రయాణం చేసిన వాళ్లకి ఒక విషయం స్పష్టం గా అర్ధమౌతుంది . మహాప్రస్థానానికి ముందు శ్రీశ్రీ వేరు . మహాప్రస్థానం శ్రీశ్రీ వేరు . మహాప్రస్థానం తరువాత శ్రీశ్రీ వేరు . మొత్తం మూడు దశలు శ్రీశ్రీ సాహిత్య జీవితం లో . ఆ మూడు దశలు తెలుగు కవిత్వం లో చెరగని అడుగుజాడలు . చిత్రం గా రెండో దశ లోని మహాప్రస్థానం మొదటి మూడవ దశలను పూర్తిగా ఓవర్లాప్ చేసి శ్రీ శ్రీ అంటే మహాప్రస్థానమే అనేటట్టు చేసింది . అది శ్రీశ్రీ మిగతా కవిత్వానికి రావలసిన పేరు రాకుండా చేసింది . అది ఖడ్గ సృష్టికీ , మరోప్రపంచానికి జరిగిన అన్యాయం .
శ్రీశ్రీ భావకవిగా కవిత్వయాత్ర ప్రారంభించి , అభ్యుదయ కవిగా దారి వేసుకుని , విప్లవకవిగా తనను తాను మల్చుకుని ప్రజా కవిగా చిరస్మరణీయుడు అయ్యాడు .
శ్రీశ్రీ కవిగా కళ్ళు తెరిచే నాటికి రాయప్రోలు , దేవులపల్లి కృష్ణశాస్త్రి , విశ్వనాధ ల ప్రభ మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతున్నది .ప్రేయసీ పయోధరాల భావకవిత్వ బ్లాక్ హోల్ కవిత్వం అని కలవరించిన ప్రతి ఒక్కరినీ తనలోకి లాగి వేసుకుంటున్నది
తన ఎనిమిదేళ్ల వయసులోనే శ్రీశ్రీ ఒక కందపద్యం రాసి తండ్రికి చూపిస్తే వాటిలో ఛందస్సు లేదని సులక్షణ సారం , అప్పకవీయం నేర్పించాడట .ఆ ఊపు లో శ్రీ శ్రీ
ప్రభవ లాంటి పద్యకావ్యాలు రాశాడు .
వివిధ సూన వితాన శోభిత కుజప్ర
శస్త సుమప్రదావన స్థలము సాంద్ర
చంద్రికా సముజ్జ్వల దివ్యశర్వరీ ప్ర
శాంత వేళ సమంచిత సౌఖ్య మొసగె
అని పౌర్ణమి నాటి రాత్రి తనలో కలిగించిన రసోజ్వల హాయిని రజనీ గానము అనే కవిత్వ ఖండిక లో శ్రీశ్రీ ప్రస్తుతించారు . ఈ పద్యం శ్రీశ్రీ అది చెప్తే తప్ప చాలామందికి తెలియదు ,. ఏ రాయప్రోలో , దేవులపల్లో రాశారు అని అనుకుంటారు . కానీ శ్రీశ్రీ కవిత్వం రాయడం మొదలు పెట్టింది ఏ విశ్వనాధ కో , రాయప్రోలుకో నీడ గా ఉండటానికి కాదు . కాలం కడుపుతో ఉండీ అతడిని కన్నది భావకవిగా నవ పల్లవాధరాల మీద తేనే లేఖలు రాయడానికి కాదు .
తరువాత ఎప్పుడో తాను రాయవలసిన ఫిరంగి లో జ్వరం ధ్వనించే మృదంగ ధ్వానం 1930 లోనే శ్రీశ్రీ కి అరవైమూడు రోజులు టైఫాయిడ్ జ్వరం తో చేసిన పోరాటం లో అనుభవం లోకి వచ్చింది . విశ్వనాథను , రాయప్రోలు బాటను వదిలి తనదయిన మార్గం కోసం పరితపించాడు .
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
అన్న జయభేరి 1933 లో ఒక ఉప్పెన లా తెలుగు కవిత్వలోకాన్ని ముంచెత్తింది . తెలుగు కవిత్వం లో అది ఒక స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ . గురజాడ వేసిన మార్గం నుండి ఒకింత పక్కకు తొలగిన కవిత్వాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించిన సందర్భం .
శ్రీశ్రీ ప్రస్థానం లో రెండో దశ మొదలు అయిన సన్నివేశం . ప్రపంచం బాధను తన బాధ గా తెలుగుకవి సొంతం చేసుకున్న సమయం . గమనించవలసిన విషయం ఏమిటంటే వస్తువు మారింది . రూపం మారింది . మారనిది ఒకటుంది . భాష
మహాప్రస్థానం అంతా పురాణ ప్రతీకల్తో శ్రీశ్రీ పాఠకుడిని విస్మయ పరుస్తాడు . వస్తువును , రూపాన్ని మార్చుకున్న శ్రీశ్రీ భాషను ఎందుకు మార్చుకోలేదు
తారా నివహపు ప్రేమ సమాగమం లో
సమ్ముగ్ధం గావించిన ఆ గాంధర్వాన్నీ
శ్రీ శ్రీ ఎందుకు వదిలించుకోలేక పోయాడు ..
అమోఘమై , అగాధమై , అచింత్యమై , అమేయమై
ఏకాంతమై , ఏకైకమై ,
క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవమై
బ్రహ్మానుభవమ్ కలిగించిన
తనను కరిగించిన కవనఘృణీ
రమణీ
కవిత
కు కొత్త భాషను ఎందుకు ఇవ్వలేక పోయాడు ?
నాకు అనిపించేదేమిటంటే సంప్రదాయం అతడిని పూర్తిగా వదిలి పెట్టకపోవడం వలన . సంప్రదాయం పునాదుల మీద శ్రీశ్రీ మహాప్రస్థానమనే పెద్ద భవనాన్ని నిర్మించాడు .
తన మరో ప్రపంచం గీతం లోని ఛందస్సుకు భజగోవిందం శ్లోకాల ఛందస్సు మూలమైతే , వాటికి విష్ణు సహస్ర నామాలు మూలం . సంప్రదాయం కూడా కాలం తో మారుతూ ఉంటుంది . అది నిలువ నీరు కాదు . నిరంతర ప్రవాహం . అందుకేనేమో
ఆ తరువాత శ్రీశ్రీ
ఆరుద్రా చూశావా తమాషా
సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా
అని చమత్కరించాడు .
బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్నె లు కాదు ఇప్పుడు కావలసింది
రాబందుల రెక్కల చప్పుడు
పొగగొట్టాపు భూంకారధ్వని
అరణ్యమున హరేంద్రఘర్జన
పయోధర ప్రచండ ఘోషం
ఖడ్గమృగోదగ్ర విరావం
ఝామఝానిలా షడ్జా ధ్వానం
కావాలోయి నవకవనానికి
అని నినదించాడు
ఇంతటి సంస్కృత పద గుంఫనం , సుదీర్ఘ సమాస అలంకరణం శ్రీశ్రీ కి అలవోకగా పట్టుబడిందా ? సులక్షణ సారమూ , అప్పకవీయ ప్రభావమా
ఛందస్సుల సర్ప పరిశ్వంగం నుండి కవిత్వాన్ని విముక్తం చేస్తాను అన్న కవి ఆ పని తన ఖడ్గసృష్టి లో , మరో ప్రపంచం లో పూర్తిగా చేశాడు
మాటలకు విలువ లేదు . వాటిని పేర్చినప్పుడు వాటికి కొంత విలువ వస్తుంది అన్నాడు శ్రీశ్రీ . పేర్చడం అంటే ఏమిటి ?
కవిత్వం లో ఏ పదం , ఏ మాట ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం అన్న మాట . వాక్యం లో పదాల స్తానం శ్రీశ్రీ కి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదేమో. అలాగే ఆ పదాలను తాత్విక అర్ధం లో ప్రయోగించడం లో కూడా
మానవుడా అనే కవిత లో శ్రీశ్రీ శరీరపరీవృతుడా అని ఒక పదాన్ని ప్రయోగిస్తాడు
వేగుంట మోహన ప్రసాద్ మాస్టారు తన కరచాలనం లో ఈ పదప్రయోగం గురించి కొంత చర్చ చేశారు .
మానవుడా అనే గేయం లో ఒక చిత్రమైన పదం వున్నది శరీర పరీవృతుడా అన్నది
ఏమిటి దీని అర్ధం ? శరీరం పశుపక్ష్యాదులకు కూడా ఉంటుంది . అలాంటప్పుడు శరీరపరీవృతుడా అని మనిషిని సంబోధించడం ఎందుకు ? శ్రీశ్రీ అవగాహనలో మనిషి శరీరం కంటే భిన్నమైన వాడు . మానవునికి శరీరాతీతమైన ఒక ఆంతరంగిక వ్యక్తిత్వం వుంది . అంతర్దృష్టి ఉంది . వివేకము విజ్ఞానము అభివృద్ధి చెందని కాలంలో దీన్ని జీవుడని ఆత్మా అని అనివుండవచ్చు . కానీ ఈనాడు అనర్ధక పదాలు విసర్జించి మానవుని వ్యక్తిత్వాన్ని మనం అర్ధం చేసుకుంటున్నాము . ఇక్కడ శరీర పరీవృతుడు అన్నమాటకి శరీరచ్చాదితుడని కావచ్చు లేదు శరీర పరిసర్పితుడని కావచ్చు . తాత్విక చిత్తవృత్తి కల వాళ్లకు , ఆ చిత్తవృత్తి పైకొన్నప్పుడు తమ శరీరమే తమకు గుదిబండ అయి నట్టు అనిపిస్తుంది . శ్రీ శ్రీ ఉద్దేశించినది ఇదేనని కచ్చితంగా చెప్పలేము . కానీ తాను శరీరం కంటే భిన్నం అనే ఒక భావాన్ని మానవునికి అనుభవం చేశే ఒక చిత్తవృత్తిని శ్రీశ్రీ సూచిస్తున్నాడని చెప్పవచ్చు , ఈ అనుభూతి ఆలోచనాపరులకు కాక ఈ తాత్విక చిత్తవృత్తి కల వాళ్లకు మాత్రమే కలుగుతుంది . శరీరం పట్ల ఎలాంటి మమకారం లేక పోవడం దానిని ఒక పరాయి వస్తువుగా చూడటం మనం రమణ మహర్షి లో చూడవచ్చు .
వేగుంట మాస్టారు కవిత్వం లో వాచ్యార్ధానికి , లోలోపలి వ్యంగ్య అర్ధానికి మధ్య చాలా తేడా ఉంటుంది అని చెపుతూ ఫై శ్రీశ్రీ పదాన్ని వివరించారు . నిజానికి శ్రీశ్రీ
మహాప్రస్థానం అంతా కనిపించే వాచ్యార్థం కంటే కనిపించని వ్యంగ్య అర్ధమే ఎక్కువగా ఉంటుంది . తెలుసుకోగలిగిన పాఠకుడికి తెలుసుకున్నంత
శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాల రచన పూర్తి అయిన తరువాత తెలుగుదేశం లో అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భవించింది . సహజం గానే శ్రీశ్రీ దానికి అధ్యక్షుడు
విశాఖ విద్యార్థుల సవాలు రచయితలారా మీరెటువైపుకి స్పందించిన శ్రీశ్రీ విరసం అధ్యక్షుడైనాడు . ఆ తరువాత మరోప్రపంచం వచ్చింది ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న రోగం ఎదో నేను మహాప్రస్థానం లో కనుగొంటే దానికి విరుగుడు నేను మరోప్రపంచం లో కనుగొన్నాను అన్నాడు శ్రీశ్రీ
విప్లవం యాడుందిరో
ఆడనే నీ కూడుందిరో
ఆడనే నీ గూడుందిరా
గోడుగోడుమని ఏడుస్తావుంటే
యాడు నీ వొంక రాడింకా రా
అని మరోప్రపంచం లో కర్తవ్య బోధ చేశాడు . ప్రభావ నాటి గ్రాధిక భాషకి , మహాప్రస్థానం నాటి పౌరాణిక భాషకి మరోప్రపంచం నాటి జన భాషకి తేడా మనకు తేలికగా అర్ధమౌతుంది . ఇది కేవలం శ్రీశ్రీ భాషలో వచ్చిన మార్పు కాదు . సమాజం లో మొత్తంగా మెల్లమెల్ల గా వచ్చిన మార్పు .
శ్రీశ్రీ కవిత్వమే కాదు . ఒసే తువ్వాలు అందుకో లాంటి కధలు , సినిమా పాటలు చాలా రాశాడు . అయినా శ్రీశ్రీ అంటే మహాప్రస్థానమే
ఒక కవిని మొదటినుండి చివరివరకు చదివితే చాలు ఒక సమాజ గమనాన్ని చదివినట్టే
చెప్పుకోతగిన ఒక్క కవీ మన కృష్ణశాస్త్రి -ఉన్నత హిమాలయ శిఖరాలలో కురిసిన కవితా వర్షం పాయలై దేశాల వెంట ప్రవహించి చివరకు సైడు కాలువల్లో పలుకుతున్న సమయాన తన భీషణాతప జ్వాలలతో ఆవిరి పొగలు ఆకాశమార్గాన విహరింపజేసి రక్షించాడు అంటాడు చలం
ఎవరినుంచి దొంగిలించామో వారిని క్షమించడం కష్టం . నిజమే శ్రీశ్రీ నుండి నేను ఏమి దొంగిలించలేదు . అయినా శ్రీశ్రీ ని క్షమించను . క్షమిస్తూ వెళితే చాలా వాటికి శ్రీశ్రీ ని క్షమించాలి . శ్రీశ్రీ ని ఎందుకు క్షమించకూడదో సిప్రాలి చదివితే తెలుస్తుంది
శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రేమించండి . అది ప్రేమ నెత్తురు కలగలసిన కాక్టైల్ లా నిషా కలిగిస్తుంది . మన మనోమాలిన్యాలను శుభ్రపరచి నిత్యనూతనం గా తయారు చేస్తుంది . మనుషులుగా మనలను నిలబెడుతుంది .
మనిషిని తద్వారా సమాజాన్ని trnsform చేయడం కంటే కవిత్వం సాధించగలిగిన గొప్ప లక్ష్యం మరేదయినా ఉన్నదా ?

కవిత్వ ప్రపంచం

రెండు పదాల మధ్య దోబూచులాడే నిశ్శబ్దమే కవిత్వం .
కవిత్వం తో నా తొలి ప్రయాణం ఎప్పుడు ఎలా మొదలైందో ఖచ్చితంగా చెప్పలేను . కానీ బహుశా గర్భస్ధ శిశువుగా ఉన్నప్పుడే మా అమ్మ గొంతెత్తి పాడిన విష్ణు సహస్ర నామాలను విని వుంటాను . పదే పదే వల్లే వేసిన పోతన మహా భాగవత పద్యాలను ఆకలింపు చేసుకుని వుంటాను . కొంచం ఊహ తెలిసిన తరువాత మా తాత గారు తన ప్రవృత్తి పరంగా పల్లెటూళ్లలో యువజనులకు భజనలు నేర్పడానికి పాడుకునే
రామదాసు కీర్తనలు విని ఉంటాను . తెలుగు ఉపాధ్యాయుడు గా మా నాన్న పరిచయం చేసిన మనుచరిత్ర లాంటి ప్రబంధాలను ఆశ్చర్య, అద్భుత భావాలు ముప్పిరి గొనగా చదివి వుంటాను . వీటన్నిటి మూలంగా ఒక కవిత్వ అభిరుచి లవ లేశ మాత్రం గా ఎదో నాలో నాటుకుని ఉంటుంది .
కవిత్వమంటే వట్టి మాటల కూర్పు కాదు అదొక మెరుపు అంటాడు ఖలీల్ జీబ్రాన్ . కవితా వ్యాసంగం సాయంకాలం కొండ మీదకు షికారుకు వెళ్లడం లాంటిది . కవితా ఖండం షికారులో అంతమయ్యే కొండపైని మహోన్నత శిఖరం . దాని చివర లోయ . లోయ లోకి కవి పడి పోకూడదు . అంటాడు రాబర్ట్ ఫ్రాస్ట్ . కవిత్వం లో ప్రతి ధ్వనీ ప్రతి ధ్వనే అంటుంది అమృతా ప్రీతమ్ . అసంకల్పితం గా , అప్రయత్నం గా , అకస్మాత్తుగా పెల్లుబికే మానవ ఉద్వేగాలకు ప్రశాంత చిత్తం తో అక్షర రూపం ఇవ్వడమే కవిత్వం అంటాడు వర్డ్స్వర్త్ . నేను ఏదయినా చదివినప్పుడు నా శరీరమంతా మంచులా చల్లగా మారి ఈ అగ్నీ దానిని వెచ్చ చేయలేకుండా ఉంటుందో అదే కవిత్వం అన్నాడు ఎమిలీ డికిన్సన్ . శ్రీ కైవల్య పదంబు చేరుటకై చింతించెదను అంటాడు సహజ కవి బమ్మెర పోతనామాత్యుడు . తన కవిత్వాన్ని లోనారసి చూడ మంటాడు వాగనుశాసనుడు నన్నయ్య భట్టారకుడు
ఎవరు ఎన్ని విధాలుగా వర్ణించినా హృదయం లోకి వెళ్లి మనసును సంతృప్తి పరచి ఇదే కవిత్వం అనే నిర్వచనం ఎప్పటికీ అందదేమో. అందుకే . పాతికేళ్లుగా కవిత్వం రాస్తున్నా , చదువుతున్నా , కవిత్వం అంటే ఏమిటి అంటే ఒక్క మాటలో చెప్పలేను నేను. అది అనుభవైకవేద్యం . కవిత్వానికి నేను ఇచ్చే నిర్వచనం నాకు మాత్రమే పరిమితం . అది మరొకరికి సంతృప్తిని ఇవ్వదు . ఎంతమంది కవులు కవిత్వం రాస్తారో అన్ని నిర్వచనాలు ఉండి తీరతాయి . నా మటుకు నేను
రెండు పదాల మధ్య ఉన్న నిశ్శబ్దమే కవిత్వం అనుకుంటాను .
ఇన్నాళ్ల తరువాత నా సొంతంగానూ , మిత్రుల సలహా మీద , ఎన్ని పుస్తకాలు చదివినా పోతన మహాభాగవతమే నా అభిమాన కవిత్వ పుస్తకం . కవిత్వం సరళంగా , సౌందర్యవంతంగా , స్వచ్ఛ సుందర శుభ్ర స్ఫటికం లా ఉండాలనే భావన నాలో మొలకెత్తి , మహా వృక్షంగా మారడానికి మహా భాగవతమే కారణం .
లలిత స్కంధము , కృష్ణమూలము , శుకాలాపాభిరామంబు , మం
జులతా శోభితమున్ , సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు. మహాఫలంబు. విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్ద్విజశ్రేయమై
ఈ పద్యం లో కనిపించే కల్పతరువు భాగవతం అనే కల్పతరువు కాదు . కవిత్వమనే కల్పతరువు అని నా నమ్మకం . ఈ కల్పతరువు మీద వాలిన చిలుకల కలకలా రావములు మనోహరములై మన మనస్సులకు ఎలా ఆనందాన్ని , ఆహ్లాదాన్ని కలుగ చేస్తాయో , కవిత్వ శుకముల కలకలా రావములు కూడా మన మనసులకు అదే ఆనందాన్ని కలిగిస్తాయి . ఒక్క సారి మనం కవిత్వ కల్పవృక్ష నీడ లోకి వెళ్లిన తరువాత దాని ఫలములు వెదజల్లే అమృత రస పానము చేస్తే మనము అజరామరులమే అవుతాము
భాగవతం లోని రుక్మిణీ కళ్యాణం ఘట్టం లో శ్రీ కృష్ణుని సౌందర్యాన్ని వివరించే పద్యం ఒకటి ఉంటుంది . నిజానికి స్త్రీ ని వర్ణించమంటే కవులు వొంటి మీద ఉన్న స్పృహను మరచి పోతారు . కానీ నయన మనోహరుడైన నల్లనయ్య సౌందర్యాన్ని వర్ణించడం లో పోతన తనను తాను మరచి పోయాడు . బహుశా ఈ పద్య సౌరభానికి దాసుడై పోయే కృష్ణ శాస్త్రి తన అన్వేషణ అనే కావ్య ఖండిక లో
ఇల్లు వదిలి
పల్లె వదిలి
సాము సడలిన పతి పరిశ్వంగం వదిలి
కృష్ణుడి కోసం బృందావనానికి పరుగులు తీశారని రాసి వుంటారు .
రుక్మిణిని వర్ణించేటప్పుడు అలీ నీలాలకను పూర్ణ చంద్రముఖిన్ అన్న పోతన కృష్ణుడిని వర్ణించేటప్పుడు చంద్రమండల ముఖున్ అన్నాడు . రుక్మిణి పూర్ణ చంద్రముఖి అయితే కృష్ణుడు చంద్రమండల ముఖుడు అట
తన పాత్రల పట్ల ఎంత ఏకాగ్రత , ప్రేమ ఉంటే తప్ప ఇలాంటి పాత్ర చిత్రణలు సాధ్యం కాదు .
కవిత లో ఒక పదం పడవలసిన స్థానం లో పడక పోతే పదానికి వున్న అర్ధమే మారి పోయి రసాభాస అవుతుంది .
నిజానికి పోతన భాగవతం లోని ప్రతి పద్యమూ ఒక రసగుళికే . ఆ అంబుధి లోతు చూడగలిగిన వాడికి చూడగలిగినంత ఆనందం లభిస్తుంది . అంతేనా ?
లోకములు , లోకులు లోక పాలకులు, అందరూ కూడా అంతమైన పిమ్మట . అలోకమైన పెంజీకటి కవతల ఎవ్వడు ఏకైక పరం జ్యోతి రూపం లో నుండునో వారిని సేవింతును అని గజేంద్రుడు ప్రార్ధించినప్పుడు పెంజీకటి కవతల అనే పదబంధం విన్నాక , చదివాక మనసు పరి పరి విధముల పోతుంది .
వేదాహమేతం పురుషం మహాంతం
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్
అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పినట్టు తమస్సుకు కు ఆవలి తీరాన ఆదిత్య వర్ణం లో ప్రకాశించే అనంత మహాపురుషుడిని నేను తెలుసుకో గలిగాను అని ఒక మహా ఋషి ఎలుగెత్తి చాటిన రీతి గుర్తుకు వస్తుంది .
ఎప్పటి శ్వేతాశ్వతరోపనిషత్తు , ఎప్పటి మహాభాగవతం ఎక్కడి సత్యాన్వేషణ ?
ఈ అన్వేషణ కి మనిషికి జవాబు దొరికిందా ? అతడి అసంతృప్తికి సాంత్వన లేపనం లభించిందా ? ఈ ప్రశ్నలకు జవాబు వెతకడం కోసమే సమస్త సాహిత్యమూ , కవిత్వమూ ప్రయత్నం చేస్తున్నది
శ్రీ కృష్ణుడి లీలా మానుష లీలల సమాహారం భాగవతం అనుకుంటాము కానీ అది మన భౌతిక , ఆధ్యాత్మిక ఆలోచనలను శుద్ధి (ప్యూరిఫై ) చేసే ఔషధం ,
పెంజీకటి కావల ఏమున్నదో అని అన్వేషించే రుషుల పరంపరను విస్మరించి డేరా సచ్చా సౌధా బాబాల పాదాల మీదకు వాలిపోయే స్థితి కి భారత ఆధ్యాత్మిక చైతన్యం ఎదిగిందంటే ఒకింత దుఃఖం నిలువెల్లా చుట్టూ ముట్టక మానదు
వాట్ ఏ ఫాల్ మై కంట్రీ మెన్ అని అనిపించక మానదు
ఒక కవిత కవి హృదయం నుండి పాఠకుడి హృదయం లోకి ప్రవేశించినప్పుడు అతడికి ఒక అద్భుతమైన దర్శనం , భావ సంచలనం కలిగి అతడు ఒక కొత్త రూపాన్ని ధరించాలి
కవి వాడ్రేవు చిన వీరభద్రుడు
ఒక కవిత నీ మైదానాల లోకి ప్రవేశించేటప్పుడు
చుట్టూ అడవి తుమ్మెదల ఉన్మత్త ఝంకారం
వెల్లువలా విరబూసిన మామిడి పూత దారులంతా
యువతుల తరుణ దేహాల మాదక సుగంధం
మొదటి సారి నాన్న నీతో సముద్రపుటొడ్డున దూర
దీపాలు చూపించి నౌకలు గుర్తుపట్టించినట్టు
కోకిల వినిపించే గాధాసప్తశతి గుర్తుగా , ధూళి
రహిత దిగంతపు మలుపులో కవితను పోల్చుకో
అంటారు
మహాభాగవతం లో ఎప్పుడు ఏ పద్యం చదివినా నాకు పై అనుభూతి కలిగి
నేను మరో నేను లా మిగిలి పోతాను
ఏ కవితకైనా ఇంతకంటే పరమార్ధం మరేదయినా ఉంటుందా ?

23, జులై 2013, మంగళవారం

వారం రోజుల క్రితం బ్యాంక్ లో నా పని యెదో నేను చెసుకుంటుంటే భరోత్ సక్రు అనే ఒక మధ్య వయసు మనిషి నా దగ్గరకు వచ్చి
"సర్ నా పట్టదారు పాస్ పుస్తకం నాకు ఇప్పించండి " అని అడిగాడు ,
అతడు బ్యాంక్ లో బాకీ ఏమీ లేక పొవడం తో పాస్ పుస్తకం తిరిగి ఇస్తూ సహజమైన కుతూహలం తో " మళ్ళీ అప్పు తేసుకోరా?" అని అడిగాను.
లేదండీ ఇప్పుడు మీరు ఇచ్చే వేల రూపాయల అప్పు నాకు సరి పోదు అన్నడు. పాస్ పుస్తకం లో చూస్తే 3 ఎకరాల  పొలం మాత్రమే వుంది. లక్ష రూపాయలు సరిపోవా అని అడిగాను.
అతడు నవ్వి వ్యవసాయానికి అయితే సరి పొతాయి. ఎన్నికలకి సరిపోవు కదండీ  అన్నాడు.నాకు మరింత కుతూహలం పెరిగి "ఎన్నికలలో  నిలబదుతున్నవా ?" అని అడిగాను. అప్పుడు అతడు ఇలా చెప్పుకొచ్చాడు.
"రిజర్వేషన్లలో మా వూరు ఎస్ టి జనరల్ అయింది. మా వూళ్ళో మావి రెండు ఎస్ టి కుటుంబాలు మాత్రమే వున్నయి. రాజకీయ నాయకులు అందరూ నన్ను బలవంతం చేసి నిలబడేలా వేధించారు. నేను ఒక పార్టీ తరఫున ,మా తమ్ముడు మరొక పార్టీ  తరఫున నిలబడ్డము.  చివరకి ఒప్పుకోక తప్ప లేదు. తీరా దిగిన తరువాత కానీ నాకు అర్ధం కాలేదు. పార్టీ నాకు ఎన్నికల ఖర్చు నిమిత్తం మూడు లక్షల రూపాయలు ఇస్తుంది, మిగతాడి నేను పెట్టుకోవాలి అన్నారు.  మా తమ్ముడి పార్టీ కి బాగా డబ్బు వున్నది, వాడి పార్టీ తొ నేను పొటీ పడలేను. కానీ తప్పదు. :
మరిప్పుడీ పాస్ పుస్తకం ఎందుకు అన్నాను. సక్రు నావైపు వింతగా చూసి "ఈ పట్టదారు పుస్తకం రిజిస్త్రేషన్ కోసం. భూమి తనఖా రిజిస్త్రేషన్ చేసి నాలుగు లక్షలు అప్పు తీసుకుంటున్నాను. మూడు రూపాయల వడ్డీకి. రెండు సంవత్సరాలలో అప్పు తీర్చాలి. లేక పొతే భూమి ని వాళ్ళు వాల్చుకుంటారు."
" గేలిస్తే పరవాలేదు. ఒక వేల నీవు వోడి పోతే "  అన్నను.
గేల్చినా, వోడినా అప్పు తీర్చాల్సిందే కదా అన్నాడూ సక్రు. నాకు కొంచం బాధ కలిగింది. ఈ మూడు ఎకరాలు సంపాదించడానికి నీకు ఎన్ని ఏళ్ళు పట్టింది. అన్నాను. సక్రు చిన్నగా నవ్వి "ఇది నేను సంపాదించింది కాదండి. మా నాన్న వారసత్వం గా ఇచ్చింది. " అన్నాడు. "ఒక వేళ నువ్వు ఓడిపొతే రెండేళ్ళ లో  మాడు లక్షల రూపాయలు సంపాదించగలననే నమ్మకం వుందా అంతె, గెల్చినా నేను సంపాదించలేను. అన్నాడు. అలా అంటున్నప్పుడు అతడి కళ్ళలో సన్నటి కన్నీటి రేఖ ఒకటి నన్ను దాటి పొలేక పొయింది. ఇవాళ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
సక్రు ఓడి పొయాడు.
ఒక సన్నకారు రైతు బహుశా రేపు కౌలుదారు కార్డుల కోసం ఎం ఆర్ ఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ కనబడతాడేమో .
ప్రజాస్వామ్యమా నువ్వు వెయ్యెళ్ళు వర్ధిల్లు. 
 

13, నవంబర్ 2009, శుక్రవారం

వాడి నిద్ర

వాడికి మూడేళ్లు
అచ్చం నా లాగే నడుస్తాడు
నా లాగే నవ్వుతాడు
నాన్న స్టాంపు అంటుంది వాళ్ళ అమ్మ
కాని పగలంతా అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతాడు వాడు
అమ్మ నడుం మీద కాలు
వాడి నోట్లో కుడి బొటన వేలు
వాడి నిద్రకు కావలసిన సరంజామా

వాడి తల మీద చెయ్యి వేసి
నిమరాలనుకుంటాను
నోట్లో వేలు తీసి
పక్కన పెట్టలనుకుంటాను.
తల నిమరలేను
వేలు తీసి పక్కన పెట్ట లేను
వాడలా నిద్ర పోతుంటే
వెదురు పూల పొదరింట్లో పరిమళ మేదో అరమోడ్పు కన్నులినట్టు వుంటుంది
లేలేత ఆకు పచ్చటి పోతిల్లలో
ఒత్చిగిల్లిన గుమ్మడి పువ్వు లాగా వుంటుంది

మా ఆవిడ మధ్య రాత్రి బద్దకంగా నన్ను లేపి
" వాడిని తీసుకెళ్ళి పాస్ పోయించండి
లేక పోతే పక్క తదిపెస్తాడు" అంటుంది
నా కా నిద్రా ముద్రిత సౌందర్యాన్ని
ముట్టుకోవాల్ని వుండదు
కాటుక చీకటి లాంటి కృష్ణ కుంతలాల మధ్య చిక్కి
అలసి సొలసి పరుండిన మల్లె పువ్వును కదిలించలనుండదు
మా సంభాషణ వింటాడో ఏమో తెలీదు కాని
అమ్మంటే భయమో నాన్నంటే అనునయమో వూహించలేను కాని
మేమిద్దరమూ గాఢ నిద్రలో వుండగా
వాడు నా పక్కలో దూరి
నన్ను తడిపేసి
అమ్మ కౌగిట్లో వెచ్చగా బజ్జుంటాడు.